ప్రేమించకుంటే చంపేస్తానన్నాడు... చదువు తప్ప వేరే లోకం తెలియని చిట్టితల్లి ప్రాణాలు తీసుకుంది!
ఆ యువతి ఇంటర్మీడియట్ చదువుతోంది. పైగా కానిస్టేబుల్ కుమార్తె. ఆ యువతిని ఓ శాడిస్ట్ వెంటపడ్డాడు. ప్రేమించమని వేధించ సాగాడు. చదువు తప్ప వేరే లోకం తెలియని ఆ చిట్టితల్లి ఆ శాడిస్ట్ వేధింపులు తాళలేక ఆత్మహత్
ఆ యువతి ఇంటర్మీడియట్ చదువుతోంది. పైగా కానిస్టేబుల్ కుమార్తె. ఆ యువతిని ఓ శాడిస్ట్ వెంటపడ్డాడు. ప్రేమించమని వేధించ సాగాడు. చదువు తప్ప వేరే లోకం తెలియని ఆ చిట్టితల్లి ఆ శాడిస్ట్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. అదిలాబాద్ జిల్లాలో జరిగిన ఈ దారుణం వివరాలను పరిశీలిస్తే...
ఆదిలాబాద్ జిల్లా చాందకు చెందిన దేవదాస్ అనే వ్యక్తి ఆదిలాబాద్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఈయనకు ఓ కుమార్తె ఉంది. ఇటీవల టెన్త్ పాసైన ఈ యువతిని జిల్లా కేంద్రంలోని ఓ కాలేజీలో ఇంటర్ చేర్పించాడు. ఇంటినుంచి బస్సులో కాలేజీకి వచ్చిపోయేది. ఈ పరిస్థితుల్లో జైనథ్ మండలం లేకర్ వాడకు చెందిన చంద్రశేఖర్ అనే పోకిరి... నిత్యం బాలిక కాలేజీకి వెళ్లివస్తుండటాన్ని గమనిస్తూ వెంటపడ్డాడు.
నిత్యం ఇంటి నుంచి బస్టాండ్కు వెళ్లేదాకా ఆ బాలికను వెంటాడటం అలవాటుగా చేసుకున్న ఆ జులాయి.. ప్రేమించాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. బాలిక ఎంతగా బతిమిలాడినా.. వద్దని ఎంతగా ప్రాధేయపడ్డా వదిలిపెట్టలేదు. పెద్దలకు తెలియకుండా వాడి బారినుంచి బయటపడదామని ఎంతగా ప్రయత్నించినా ఆ బంగారు తల్లికి సాధ్యం కాలేదు. దీంతో వాడి బండారం ఇంట్లో చెప్పింది.
దీంతో దేవదాస్ ఆ పోకిరిని మందలించాడు. దీన్ని జీర్ణించుకోలేని వాడి పిచ్చి పరాకాష్టకు చేరింది. ఇన్నాళ్లూ ఆ బాలికను పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడిన వాడు.. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. అంతేకాదు.. ఒకవేళ తప్పించుకొని ఎవరినైనా పెళ్లి చేసుకున్నా.. అతన్నికూడా చంపేస్తానంటూ హెచ్చరించాడు.
చదువు తప్ప వేరే లోకం తెలియని ఆ అమ్మాయి.. ఈ వేధింపుల పర్వం తనతోనే అంతమవ్వాలని నిర్ణయించుకుంది. తన వెంట పడుతున్న వాడు.. ఇప్పుడుకాకుంటే ఎప్పటికైనా తనవాళ్లకు ప్రమాదకరమే అని భావించింది. తాను చనిపోతే ఎవరికీ కష్టం ఉండదన్న ఆలోచనకు వచ్చింది. అంతే.. ఈనెల 14వ తేదీన ఇంట్లోకెళ్లి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 90 శాతం కాలిన గాయాలతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. చనిపోయింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.