ఒక కామాంధుడి నుంచి తన కుమార్తెను రక్షించుకోవడానికి ప్రయత్నించి చివరకు దారుణ హత్యకు గురయ్యాడో తండ్రి. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది. పలమనేరు మండలం కమలాపురంకు చెందిన వెంకటేష్ తన కుమార్తెతో కలిసి నక్కపల్లెకు వెళ్ళి కొంతమంది కూలీలను తన వ్యవసాయ పనుల కోసం పిలిచి తిరిగి ఇంటికి బయలుదేరాడు.
బెంగుళూరులో ఇటుక పనిచేసే ఆంజనేయులు అనే వ్యక్తి వీరు ప్రయాణించే మార్గంలో ప్రయాణిస్తూ వచ్చాడు. వెంకటేష్ కుమార్తెను చూసిన ఆంజనేయులు వాహనాన్ని ఆపి గొడవపెట్టుకున్నాడు. వెంకటేష్ కుమార్తెపై అత్యాచారం చేసేందుకు ఆంజనేయులు ప్రయత్నించాడు.
దీంతో వెంకటేష్ అతన్ని అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆంజనేయులు వెంకటేష్ను పాడు పడిన బావి వద్దకు లాక్కెళ్ళి అందులో తోసేశాడు. దీంతో వెంకటేష్ తలకు బావిలోని రాయి తగిలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
వెంకటేష్ కుమార్తె గట్టిగా కేకలు పెట్టడంతో స్థానికులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే ఆంజనేయులు సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.