రామాయణంలో హనుమంతుడిలాంటి వ్యక్తి మన బాపు అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అనారోగ్యం కారణంగా ఆదివారం సాయంత్రం చెన్నైలో కన్నుమూసిన బాపు పార్థీవదేహానికి చిరంజీవి సోమవారం నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపు మరణం తెలుగువారందరికీ తీరని లోటన్నారు. రామాయణంలో హనుమంతుడిలాంటి వ్యక్తి బాపు అని కొనియాడారు. అత్యద్భుతమైన రేఖా చిత్రాలు, కార్టూన్లు, సినిమాల ద్వారా బాపు తెలుగువారు మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.
బాపుకు పద్మ పురస్కారాల విషయంలో చాలా అన్యాయం జరిగిందన్నారు. బాపుకు పద్మ పురస్కారం ఎప్పుడో రావాల్సిందని... చాలా ఆలస్యంగా గత యేడాది ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చిందన్నారు. పద్మశ్రీ బాపుకు అలంకారం అవలేదని... బాపుయే పద్మశ్రీ పురస్కారానికి అలంకారమయ్యారని చిరంజీవి వ్యాఖ్యానించారు.