పవన్ కళ్యాణ్ కూడా చూసే ఉంటారుగా.. ఎలా స్పందిస్తారో చూద్దాం : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనను జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా చూసే ఉంటారు కదా.. ఆయన ఎలా స్పందిస్తారో చూద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనను జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా చూసే ఉంటారు కదా.. ఆయన ఎలా స్పందిస్తారో చూద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన తర్వాత విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'పవన్ కల్యాణ్ మొన్న మాట్లాడారు. ఈ రోజు ఆయన కూడా కేంద్ర మంత్రుల ప్రకటన చూసే ఉంటారు. ఆయన ఇప్పుడు ఏం మాట్లాడతారో... ఎలా స్పందిస్తారో చూద్దాం. రాష్ట్రాభివృద్ధికి ఎవరు సహకరించినా నాకు ఓకే' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ... 'ఇచ్చిన దానికి ధన్యవాదాలు. ఇస్తామని ఈ రోజు ప్రకటించిన వాటన్నింటికీ చట్టబద్ధత కల్పించమని అడుగుతున్నాం. వాటన్నింటికీ సంబంధించి తక్షణం అధికారిక ఉత్తర్వులు ఇవ్వాలి. ప్రత్యేక హోదా ఇస్తేనే మాకు సంతోషం కాదు. అందుకు సాంకేతిక సమస్యలు ఉన్నాయని మీరు అంటున్నారు. హోదాతో రాగల మొత్తానికి సమానమైన మొత్తాన్ని ఇస్తామని చెబుతున్నారు. అలాంటప్పుడు ఏమిస్తారో స్పష్టంగా చెప్పండి. చెప్పిన దానికి కట్టుబడి సత్వరంగా ఆ నిధులు ఇవ్వండి. హామీల అమలుకు కాల పరిమితి' కూడా నిర్ణయించాలన్నారు.