న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన సక్రమంగా జరిగి ఉంటే ఈ రోజు ప్రత్యేక హోదా, నిధులను అడుక్కునే పరిస్థితి వచ్చేది కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా ఎవరికీ లేని ఇబ్బందిని తనకే ఎందుకు కలిగిస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి డబ్బు ఇవ్వకపోతే రాష్ట్రం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదని, మిగతా రాష్ట్రాలకు లేని శిక్ష.. ఏపీకి మాత్రమే ఎందుకని.. తాము చేసిన తప్పేంటన్నారు. ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రకటించాలని ప్రధాని మోదీని కోరినట్లు తెలిపారు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు చేస్తామని మోదీ భరోసా కల్పించినట్లు చెప్పారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటక ప్రభుత్వం వ్యతిరేకిస్తుంటే ఏం చేస్తోందని ప్రశ్నించారు.