ప్రతిపక్ష నేత పట్ల కనీస మర్యాద కూడా పాటించరా? నివ్వెరపోతున్న జనం
విశాఖలో చట్టాన్ని తుంగలో తొక్కి, విమానాశ్రయాన్ని సాధారణ పోలీసుల పరం చేసి తెలుగు దేశం ప్రభుత్వం గురువారం చేసిన నిర్వాకం చూసి రాష్ట్ర ప్రజానీకం నివ్వెరపోతున్నారు. 1.27 కోట్ల ఓట్లతో 67 మంది ఎమ్మెల్యేలను
విశాఖలో చట్టాన్ని తుంగలో తొక్కి, విమానాశ్రయాన్ని సాధారణ పోలీసుల పరం చేసి తెలుగు దేశం ప్రభుత్వం గురువారం చేసిన నిర్వాకం చూసి రాష్ట్ర ప్రజానీకం నివ్వెరపోతున్నారు. 1.27 కోట్ల ఓట్లతో 67 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న పార్టీ అధినేత.. అధికారపక్షానికి 5 లక్షల ఓట్లే తేడా. బలమైన ప్రతిపక్ష నేత.. అలాంటి వ్యక్తికి.. అందునా ప్రజలకోసం గాంధేయమార్గంలో శాంతియుత ర్యాలీలో పాల్గొనడానికి వస్తున్న నాయకుడికి ఈ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన మర్యాద ఇదేనా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకుడికి మర్యాద ఇవ్వడం ఇష్టం లేకపోయినా కనీసం ప్రొటోకాల్ పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకపోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమౌతోంది.
విమానం దిగగానే రన్వేపైకి వందలాది మంది పోలీసులు చేరుకోవడమేమిటి? రన్వేపైనే అడ్డుకోవడమేమిటి? ప్రతిపక్ష నాయకుడిగా కాదు కనీసం ఒక సాధారణ ప్రయాణీకుడి విషయంలో కూడా ఇలా వ్యవహరించకూడదు కదా! ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని జనం చర్చించుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకుడితో మార్యదగా వ్యవహరించాల్సిందని, ప్రభుత్వం తరఫున ఎవరైనా ప్రతినిధులు మాట్లాడి ఉండాల్సిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.
పోలీసులో గూండాలో అర్ధం కాని రీతిలో ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా చుట్టుముట్టి భయకంపితులను చేయడం, అడుగుతున్నా ప్రయాణీకుల లాంజ్లోకి అనుమతించకపోవడం అనేక అనుమానాలు కలిగిస్తోంది. సాధారణంగా విమానాశ్రయం కేంద్ర బలగాలైన సీఐఎస్ఎఫ్ అధీనంలో ఉంటుంది. కానీ వాళ్లను కూడా భయపెట్టి, నిస్సహాయ స్థితిలోకి నెట్టి విమానాశ్రయాన్ని పోలీసులు తమ అధీనంలోకి తెచ్చుకోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలు విమానాశ్రయాన్ని పోలీసులు ఆక్రమించడమే అనుమానాస్పదమైతే.. అందులో గూండాలు ఉండడం మరింత ఆశ్చర్యకరం. వారి వ్యవహారశైలి పోలీసుల మాదిరిగా లేదు. యూనిఫాం లేదు. ఐడీ కార్డుల్లేవు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ అందరినీ తోసేస్తూ గూండాల్లానే వ్యవహరించారు. ప్రతిపక్షనేతను, ఎంపీలను పక్కకు తోసేయడం, పట్టుకుని లాగేందుకు ప్రయత్నించడం అనుమానాస్పదంగా కనిపించిందని అక్కడి ప్రయాణీకులు వ్యాఖ్యానిస్తున్నారు. గూండాలను తీసుకొచ్చి వారంతా మఫ్టీలో ఉన్న పోలీసులు అని చెప్పినట్లు అర్ధమౌతున్నది.
శాంతియుత ప్రదర్శనలో పాల్గొంటామని ప్రతిపక్ష నేత ఎంత చెప్పినా పోలీసులు అస్సలు వినిపించుకోలేదు. విమానాశ్రయం లాంజ్లోకి కూడా రానివ్వకుండా తలుపులకు తాళాలేసి తిరిగి బలవంతంగా హైదరాబాద్ విమానం ఎక్కించడం చూస్తుంటే అంతా ఒక స్క్రిప్టు ప్రకారం పక్కాగా అమలు చేసినట్లు అర్ధమౌతున్నది. టికెట్లు కూడా పోలీసులే తీసుకుని వైఎస్సార్సీపీ నాయకులను హైదరాబాద్ విమానంలోకి బలవంతంగా తరలించారని తెలుస్తోంది. ప్రతిపక్షనేత ఒక శాంతియుత ర్యాలీలో పాల్గొనడానికి వస్తుంటే ఇలా బలవంతంగా విమానాశ్రయంలోనే అడ్డుకుని వెనక్కి తిప్పి పంపడం బహుశా రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమమని వినిపిస్తోంది.
ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని ఊరికే వదలనని, తమపట్ల విమానాశ్రయంలో ఇంత అమర్యాదగా వ్యవహరించిన అధికారులందరిపై శాసనసభ ప్రివిలైజ్ కమిటీ ముందుకు లాగుతామని హెచ్చరించారు. ‘ఎలా బిహేవ్ చేయ్యాలో తెలియనోళ్లు పోలీసులు ఎలా అయ్యారు.. డొమెస్టిక్ ఎరైవల్ బోర్డు కనపడడం లేదా మీకు .. ప్రయాణీకులను పంపించరా.. అయితే.. ఆ బోర్డు పీకేయండి.. అని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. డోర్ ఓపెన్ చేయండి....డొమస్టిక్ ఎరైవల్స్ ఎయిర్పోర్టు రన్వే పై ఆపుతారేంటి.. ఏం మాట్లాడుతున్నారో.. ఏం చేస్తున్నారో మీకేమైనా అర్థమవుతుందా అని ప్రశ్నించారు. అసలు మీరు పోలీస్ యూనిఫాం వేసుకోలేదు.. మీరు పోలీసులేనా... మీ ఐడెంటిటీ కార్డులేవీ... గుర్తింపు కార్డుల్లేకుండా ఎలా వచ్చారు.. అంటూ సివిల్ డ్రస్లో ఉన్న వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు.
మరోవైపు వైఎస్ జగన్కు మద్దతుగా ఎయిర్పోర్టు బయట వేలాదిమంది వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, జగన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన విశాఖ పోలీస్ కమిషనర్ టి.యోగానంద్ వైఎస్ జగన్తో చర్చలు జరిపారు. రిపబ్లిక్ డే వేడుకలతో పాటు విశాఖలో భాగస్వామ్య సదస్సు జరుగుతున్న నేపథ్యంలో 144సెక్షన్ అమల్లో ఉందని, అందుకే ప్రదర్శనలకు అనుమతి లేదని చెప్పారు. తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవాలని అభ్యర్ధించారు.
తాను కొవ్వొత్తుల ర్యాలీకి వెళ్లాలని..బయటకు వెళ్లేందుకు గేట్లు తెరవాల్సిందిగా జగన్ కోరారు. గందరగోళంలో మా అధికారులు రన్వే వద్ద ఆపడం సరికాదు.. అది తెలుసుకునే మీకు వివరించేందుకు వచ్చాను.. ర్యాలీకి అనుమతి లేదు.. దయచేసి మీరు తిరిగి వెళ్లండి.. అని సీపీ యోగానంద్ వివరించారు. వైఎస్ జగన్తో పాటు ఎంపీలు, ఇతర నేతలను కూడా అదే విమానంలో తిరిగి హైదరాబాద్ పంపించారు.