హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మండి జిల్లా, జోగిందర్ నగర్ సమీపంలో హిమాచల్ ప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్టుకు చెందిన బస్సు ఒకటి అత్యంత వేగంగా వెళుతూ అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 14 మంది దుర్మరణం చెందారు.
గాయపడిన వారిని మండి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. గత రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 55 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.