సమైక్యాంధ్ర కోసం చివరి రక్తపుబొట్టు వరకు పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పునరుద్ఘాటించారు. విజయవాడలో శనివారం జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు సమైక్యతనే కోరుకుంటోందన్నారు.
తన ఓటు సమైక్యాంధ్రకే అని చెప్పారు. ప్రతినేతా సమక్యవాదానికి కట్టుబడి ఉంటేనే రాష్ట్రం ముక్కలవకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా ప్రకటన చేశారని లగడపాటి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా రాష్ట్రాన్ని విభజించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సమైక్యవాదానికి కట్టుబడేలా చేస్తామన్నారు.
కాగా 11వ రోజు కూడా జిల్లావ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలు, రాస్తారోకోలు కొనసాగుతున్నాయి. విజయవాడలో ఎల్పీజీ డీలర్లు పాదయాత్ర చేయగా, వస్త్రవ్యాపారులు పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి సబ్ కలెక్టరేట్ కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించారు. టాక్సీ యాజమానులు ప్రదర్శన చేశారు.