గుండెపోటుకు గురైన సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్ లిమిటెడ్ మాజీ ఛైర్మన్ రామలింగ రాజు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆయనను పరిశీలించిన వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచారు. రాజుకు మరిన్ని వైద్య పరీక్షలు చేయాల్సి ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ పరీక్షలు పూర్తయ్యేంత వరకు రాజును ఆస్పత్రిలో తమ పర్యవేక్షణలో ఉంచుకోనున్నట్టు నిమ్స్ వైద్యులు వెల్లడించారు.
సత్యం కంప్యూటర్స్ కుంభకోణానికి సంబంధించి రామలింగ రాజును సీబీసీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం చెంచల్గూడ జైలులో ట్రయల్ ఖైదీగా జైలు జీవితం గడుపుతున్న రాజు.. సోమవారం సాయంత్రం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను జైలులోనే ప్రాథమిక చికిత్స చేసి, ఆ తర్వాత ఆంబులెన్స్లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి నిమ్స్కు తరలించి ఐసీయులో ఉంచారు.