దేవినేని ఉమామహేశ్వర రావు సోదరుల మధ్య ఏర్పడిన తగాదా పార్టీ కార్యాలయానికి తాళం వేసేంతవరకు దారితీయడంపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదే అంశంపై దేవినేని ఉమ వివరణ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది.
టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు, ఈయన సోదరుడు దేవినేని చంద్రశేఖర్ల మధ్య ఏర్పడిన ఆస్తి పోరు తారా స్థాయికి చేరిన విషయం తెల్సిందే. దీంతో ఉమామహేశ్వర రావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ ఆగ్రహంతో టీడీపీ కార్యాలయానికి తాళం వేశారు. ఈ చర్య టీడీపీ శ్రేణుల్లో సరికొత్త వివాదం, చర్చకు దారితీసేలా కనిపిస్తోంది.
విజయవాడ పట్టణ పార్టీ కార్యాలయం దేవినేని ఉమ్మడి కుటుంబ ఆస్తి భవనంలో ఉంది. ఈ ఆస్తి వాటాల్లో సోదరుడు చంద్రశేఖర్కు భాగం ఇచ్చేందుకు దేవినేని ఉమామహేశ్వర రావు ససేమిరా అన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆగ్రహించిన చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తాళం వేశారు. ఈ సంఘటన గురువారం చోటు చేసుకోగా, శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
చంద్రశేఖర్ ఈ చర్యకు దిగినపుడు దేవినేని ఉమ స్థానికంగా లేరని టీడీపీ శ్రేణులు చెపుతున్నాయి. ఉమ్మడి కుటుంబానికి చెందిన ఆస్తిలో వాటా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ చంద్రశేఖర్ ఈ పని చేశారని వారు అభిప్రాయపడుతున్నారు. తన సోదరుడి ఆధిపత్య ధోరణికి నిరసనగా తాళం వేసినట్లు చంద్రశేఖర్ చెప్పారు.