సొంత పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎంపీలపై ప్రభుత్వ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి మరోమారు నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు నెక్లెస్ రోడ్డులో జరిగిన తెలంగాణ మార్చ్లో పాల్గొనే దమ్మూధైర్యం లేకే, సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారని ఆరోపించారు.
ఎంపీలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, వారికి దమ్ము, ధైర్యం ఉంటే వారి ప్రతాపాన్ని ఢిల్లీలో చూపి తెలంగాణ తీసుకు రావాలని సవాల్ విసిరారు. పెద్దపల్లి ఎంపీ వివేక్ లేఖ అర్థం పర్థం లేనిదిగా ఉందన్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సీఎంను విమర్శిస్తూ లేఖ రాయడం పార్టీని బజారుకీడ్చడమే అని మండిపడ్డారు.
రోడ్డుపై ఆందోళనలు, సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నాలు చేసి మీడియాకెక్కితే తెలంగాణ వస్తుందా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. మీడియా ముందు మాట్లాడటం, కిరణ్ను విమర్శించడం కాకుండా ఢిల్లీలో తేల్చుకోవాలని తెలంగాణ ఎంపీలకు ఆయన సూచించారు.