తెలంగాణ ప్రాంతానికి చెందిన పార్లమెంట్ సభ్యులు తమతమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడం దురదృష్టకరం, బాధాకరమని లోక్సభ స్పీకర్ మీరా కుమార్ అన్నారు. ఆమె శుక్రవారం ఢిల్లీలో మాట్లాడుతూ... తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలు చేసిన రాజీనామాలపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోగానే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గాను ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఈ రాజీనామా పత్రాలను నేరుగా స్పీకర్కు సమర్పించగా, తెరాస ఎంపీలు మాత్రం ఫ్యాక్స్ ద్వారా స్పీకర్కు పంపారు.
ఇదిలావుండగా, తెలంగాణ కోసం ఎంపీలు రాజీనామాల ఉపసంహరణకు నిరాకరించారు. వెంటనే తెలంగాణ ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో తమ రాజీనామాలను ఆమోదించాలని టీ కాంగ్రెస్ ఎంపీలు తమ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.