కాంగ్రెస్ మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి రోజుకో విధంగా మాట్లాడుతున్నారు. కొద్దిసేపు సమైక్యాంధ్రకు మద్దతు ఇస్తున్నట్టు.. మరికొంత సేపు రాయల తెలంగాణకు డిమాండ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ వచ్చారు. తాజాగా జై తెలంగాణ అనే నినాదం చేసి టీ కాంగ్రెస్ నేతల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు.
తెలంగాణపై భవిష్యత్ కార్యాచరణతో పాటు.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరిస్తున్న తీరు, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయడం వంటి అంశాలను చర్చించేందుకు టి కాంగ్రెస్ నేతలు మంగళవారం సీఎల్పీలో సమావేశమయ్యారు. ఈ భేటీకి టీ కాంగ్రెస్కు చెందిన ఐదుగురు మంత్రులు, నలుగురు ఎంపీలు, 12 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
ఆ సమయంలో సీఎల్పీ కార్యాలయం వైపు వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి.. టీ కాంగ్రెస్ నేతల సమావేశం జరుగుతున్న విషయాన్ని తెలుసుకుని నేరుగా సమావేశ మందిరంలోకి వెళ్లారు. అక్కడ రాయల తెలంగాణకు సమ్మతించాలంటూ టీ కాంగ్రెస్ నేతలను కోరారు. దీనికి వారు ససేమిరా అనడమే కాకుండా, జేసీని కించపరిచేలా వ్యాఖ్యానించారు.
అయితే మీరు రాయల తెలంగాణ అంటే మా (తెలంగాణ) రాష్ట్రానికి గవర్నర్గా ఎలా వస్తారంటూ ప్రశ్నించడంతో జై తెలంగాణ అనే నినాదం చేస్తూ జేసి దివాకర్ రెడ్డి సమావేశ హాల్ నుంచి బయటకు వచ్చారు.