ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సరికొత్త యాత్రను చేపట్టనున్నారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల ఫలితంగా రాష్ట్రానికి అపార నష్టం వాటిల్లింది. పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం పొంచివుంది. ఈ నేపథ్యంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో రాష్ట్రయాత్రను చేపట్టాలని ఆయన భావించారు.
ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య సూచన ప్రాయంగా వెల్లడించారు. ఇప్పటికే, సమైక్యాంధ్రకు బహిరంగ మద్దతు ప్రకటించిన చిరంజీవి.. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ఆందోళన, ఆవేదన కలిగిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో శాంతికి ఏమాత్రం విఘాతం కలిగించకుండా ఈ యాత్రను చేపట్టనున్నారు. ప్రధానంగా, సేవ్ ఆంధ్రప్రదేశ్ యాత్ర ద్వారా అటు రాష్ట్రాన్ని రక్షించుకోవడమే కాకుండా, రాష్ట్రం సమైక్యంగా ఉంటే చేకూరే ప్రయోజనాలను ఆయన రాష్ట్ర ప్రజానీకానికి వెల్లడించనున్నారు.
ఇదే విషయంపై రామచంద్రయ్య శనివారం విలేఖర్లతో మాట్లాడుతూ.. గత నాలుగు నెలలుగా రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల వల్ల రాష్ట్ర ఇమేజి పారిశ్రామికంగా దెబ్బతిందన్నారు. దీని ప్రభావం పెట్టుబడులపై తప్పక ఉంటుందన్నారు. ఇప్పటికే సమైక్యాంధ్ర, తెలంగాణా ఉద్యమాల వల్ల రాజకీయ గందరగోళంతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడి పోయిందన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి మంచి ఛరిష్మా కలిగిన నేత అని అన్నారు. ఆయన లేని లోటు ప్రస్తుతం రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వైఎస్ మృతి వెనుక రిలయన్స్ అధినేతల కుట్ర ఉన్నట్లు వచ్చిన ఆరోపణలపై కూడా దర్యాప్తు ఏజన్సీలు విచారణ చేయాలన్నారు.