అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచిన సినీ నటుడు గుమ్మడి వెంకటేశ్వర రావుకు ముఖ్యమంత్రి కె.రోశయ్యతో సహా పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు నివాళులు అర్పించారు. గుమ్మడి అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామంలో జరుగనున్నాయి.
మూత్రపిండ సంబంధ వ్యాధితో మంగళవారం రాత్రి హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రిలో గుమ్మడి మరణించిన విషయం తెల్సిందే. గుమ్మడి మరణ వార్తను తెలుసుకున్న ముఖ్యమంత్రి కేర్ ఆస్పత్రికి వెళ్లి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా రోశయ్య మీడియాతో మాట్లాడుతూ, గుమ్మడి మృతి సినీ రంగానికి తీరని లోటుగా వ్యాఖ్యానించారు. గుమ్మడి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.
చిన్ననాటి నుంచి తామిద్దరం మంచి స్నేహితులమన్నారు. తామిద్దరిదీ ఒకే జిల్లా, ఒకే ప్రాంతం కావడం యాదృచ్ఛికమన్నారు. సినీ నటుడు మురళీమోహన్, అక్కినేని నాగేశ్వరరావు, జమున తదితర ప్రముఖులు పలువురు గుమ్మడికి నివాళులు అర్పించారు.