తెలంగాణ రాష్ట్ర ఉద్యమకర్త, టీఆర్ఎస్ చీఫ్ కే చంద్రశేఖర్ రావును హత్య కుట్ర జరుగుతోందని తెరాస ఎమ్మెల్యేలు చెప్పడంపై తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ ను ఎవరు హత్య చేయాలనుకుంటున్నారో వెల్లడించాలన్నారు.
ఇదిలావుంటే కేసీఆర్పై ఈగ వాలితే రాష్ట్రం అల్లకల్లోలమే అవుతుందని ఆ పార్టీ రాష్ట్ర శాసనసభానేత ఈటెల రాజేందర్ హెచ్చరించారు. కేసీఆర్ను హత్య చేసేందుకు కొందరికి సుపారీ చెల్లించారని నిఘా వర్గాలు ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు వచ్చిన వార్తలపై ఈటెల మంగళవారం ఘాటుగా స్పందించారు.
తెలంగాణ నాలుగున్నార కోట్ల మంది ఆశాకిరణం కేసీఆర్ను కొన్ని శక్తులు హత్య చేయాలని కుట్ర పన్నుతున్నాయని, కేసీఆర్కు ఏమైనా జరగకూడనిది జరిగితే రాష్ట్రం అల్లకల్లోలమవుతుందని ఈటెల హెచ్చరించారు. మూడు రోజుల క్రితం ఇంటెలిజెన్స్ ఐజీని కలిసి వివరాలు అందజేసిందని చెప్పారు. ఇందుకోసం కుట్ర ఫోన్కాల్స్ పరంపర కొనసాగుతుందని తెలిపారు.
కేసీఆర్ను హతమార్చాలనుకోవడం పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. కేసీఆర్ను హత్య చేయడానికి ఎవరు సుపారి అఫర్ చేశారో, ఎవరు తీసుకోవడానికి వచ్చారో తమ దగ్గర సమాచారం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎటాంటి భేషజాలు లేకుండా కేసీఆర్కు జెడ్ప్లస్ కేటగిరి సెక్యూరిటీ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, కుట్రపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని ఈటెల డిమాండ్ చేశారు.