టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ అంశం కీలకదశకు చేరిన తరుణంలో కేసీఆర్ ఫాంహౌస్లో గడపుతున్నారంటూ ఆయన మండిపడ్డారు.
రోమ్ తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిన చందంగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారంటూ మోత్కుపల్లి విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కేసీఆర్ కుటుంబం కోట్లకు పడగెత్తిందని ఆయన ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను కేసీఆర్ ఒక్కసారి కూడా తలవలేదని మోత్కుపల్లి అన్నారు.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తుపాకి రాముడులాంటి వాడని మోత్కుపల్లి ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమాన్ని డబ్బులకు అమ్ముకున్న ఘనత కేసీఆర్ కుటుంబానిదే అని మోత్కుపల్లి మండిపడ్డారు.
ఫాంహౌస్లో వ్యవసాయం చేస్తూ, ఎకరానికి కోటి సంపాదిస్తున్నానని... విలేకరులను తీసుకెళ్లి చూపించారని... వ్యవసాయంలో అంత ఆదాయం ఉంటే ఇంత మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ తన దగ్గరున్న నల్లధనాన్ని ఎరువుగా వేసి తెల్లధనాన్ని పండిస్తున్నారని ఆరోపించారు.