బేగంపేట ఎయిర్షో ప్రారంభ వేడుకల్లో చోటు చేసుకున్న విషాదకర సంఘటనలో పైలట్, కో పైలట్లు ఇద్దరూ మృతి చెందిననట్టు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఏకే.ఖాన్ తెలిపారు. విమానం ఓ బహుళ అంతస్తుపై కూలిపోవడంతో అందులో ఉన్న ఏడుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
కాగా ఎయిర్ షో ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు సూర్య కిరణ్ విమానాలు సాహస విన్యాసాలను బుధవారం చేపట్టాయి. ఆ సమయంలో ఎంకే-2 తరహా విమానం ఒకటి అదుపుతప్పి న్యూబోయిన్పల్లిలోని మూడు అంతస్తుల భవనంపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ సురేష్ మౌర్య, కోపైలట్ రాహుల్ నాయర్లు మృతి చెందారు. భవనంలో ఉన్న నలుగురు వ్యక్తులు గాయపడగా, వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఇదిలావుండగా, 1982 సంవత్సరంలో సూర్యకిరణ్ యుద్ధ విమానాలు భారత్లో అందుబాటులోకి వచ్చాయి. 1996లో తొలి ఎయిర్షోను నిర్వహించాయి. బీదర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కేంద్రంగా ఈ విమానాల కార్యకలాపాలు సాగుతుంటాయి. 2006 ఏప్రిల్ 18వ తేదీన తొలిసారి సూర్యకిరణ్ విమానాలు ప్రమాదానికి గురైంది.
ఆ తర్వాత 2009 జనవరి 21వ తేదీ మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఏకబిగువున 300 నాటికల్ మైళ్ళ దూరం ప్రయాణించేందుకు వీలుగా ఇందులో ఇంధనం నింపుకునే సౌలభ్యం ఉంటుంది. కాగా, 2006 సంవత్సరంలో సూర్యకిరణ్ విమానాలకు స్కాడ్రస్ స్టేటస్ను ఇచ్చారు.