రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే కాకుండా చాలా బ్రహ్మాస్త్రాలు, పాసుపతాస్త్రాలు ఉన్నాయని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని ఆయన మరోమారు నొక్కివక్కాణించారు.
సోమవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ వేదికగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారని, అలాగే, తమ వద్ద ఉన్న మిగిలిన అస్త్రాలు కూడా అవసరం వచ్చినప్పుడు ప్రయోగిస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి రాష్ట్రపతిని కలిసి, విభజించవద్దని కోరతామని తెలిపారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లు పార్లమెంటులో చర్చకు రాదని ఆయన అభిప్రాయపడ్డారు.