తమను రాజీనామా చేయాలని డెడ్లైన్ విధించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే టి.హరీష్ రావు ఏమైనా పుడింగా అని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. ఆయన గురువారం హైదరాబాద్లో మాట్లాడుతూ.. తెలంగాణపై చిత్తశుద్ధి లేకుండా మాట్లాడవద్దని హితవు పలికారు.
సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఓ బచ్చాగా పేర్కొన్నారు. ఉద్యమం పేరుతో అదిలాబాద్ జిల్లాలో బినామీ పేరుతో రూ.400 కోట్ల రోడ్డు కాంట్రాక్టు హరీష్ రావు చేపట్ట లేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగ సంక్షోభం ద్వారానే తెలంగాణ సాధ్యమని తెలుగుదేశం ఎప్పటి నుండో వాదిస్తోందన్నారు.
బాన్సువాడ ఉప ఎన్నికల్లోనే కాకుండా, సంయుక్త ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎలాంటి ఎన్నికల్లోనైనా పోటీ చేయకుండా దూరంగా ఉండేందుకు సిద్ధమా అంటూ ఆయన ప్రశ్నించారు. రాజీనామాలు చేస్తే పోటీకి దూరంగా ఉంటామని తెలుగుదేశం పార్టీ ఎప్పుడో ప్రకటించిందన్నారు. తెలంగాణ కోసం అంటూ రాజీనామా చేసిన బాన్సువాడ మాజీ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి పోటీలో నిలువకుండా ఆదర్శంగా నిలవాలని సూచించారు.
ఇకపోతే.. తెలంగాణపై తమ వైఖరి స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు. ఎవరో చెప్తే తాము రాజీనామాలు చేయబోమని ఆయన అన్నారు. రాజీనామాలు చేయాలని చెప్పడానికి హరీష్ రావు ఎవరని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ పేరు చెప్పుకుని తెరాస అధ్యక్షుడు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు పదవులు పంచుకుంటున్నారని ఎర్రబెల్లి విమర్శించారు.