ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాత్ర ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. ఆయన ఆదివారం హైదరాబాద్లో మాట్లాడుతూ.. మతం ముసుగులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే కుట్ర జరుగుతోందన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.
ఈ కుట్ర వెనుక జగన్ పాత్ర ఉందని తాము భావిస్తున్నట్టు చెప్పారు. వైఎస్ కాలం నుంచి వారి కుటుంబం రాజకీయాల్లో శిఖండి పాత్ర పోషిస్తున్నారని ఆయన విమర్శించారు. కుల,మతాల మధ్య చిచ్చురేపి తెలంగాణను అడ్డుకునే కుట్రలను ప్రజలు వమ్ము చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
గతంలో పదవుల కోసం హైదరాబాద్లో మతకలహాలు సృష్టించిన చరిత్ర వైఎస్ కుటుంబానికి ఉందన్నారు. ఇప్పుడు జగన్, అక్బరుద్దీన్లు కలిసి నాటి సంఘటనలను పునరావృతం చేసేందుకు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. వారిని తెలంగాణ ప్రజలు ఛీకొడుతారని అన్నారు.