ఒకవేళ పోలవరంకు పట్టిసీమ ప్రాజెక్టును ప్రత్యామ్నాయంగా భావిస్తే.. పోలవరం నిర్మాణం ఎందుకని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రశ్నించారు. పట్టిసీమ నుంచి నీటి సరఫరా మొదలవుతుందని సీఎం చంద్రబాబు చెప్పడంపై రఘువీరారెడ్డి ఫైర్ అయ్యారు. నెల రోజుల్లోపల రాయలసీమకు నీళ్లు రాకపోతే... టీడీపీ నాయకులు తలలు ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. టీడీపీ బతుకే ఇంకుడుగుంత బతుకని... చంద్రబాబు జాతకం కూడా అంతేనని ఎద్దేవా చేశారు.
పోలవరం ప్రాజెక్టుకు టీడీపీ, బీజేపీలు వ్యతిరేకమని రఘువీరారెడ్డి వెల్లడించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడులు నాటకాలాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడులపై ఈనెల 7, 8, 9 తేదీల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేస్తారని తెలిపారు.