రేవంత్ రెడ్డిపై నాయిని తీవ్రంగా ఫైర్ అయ్యారు. మెట్రో భూముల విషయంలో టీఆర్ఎస్ సర్కార్పై విమర్శలు చేస్తోన్న రేవంత్ రెడ్డిపై తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సంహారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ పునర్నిర్మాణానికి శ్రమిస్తున్న కేసీఆర్ ను విమర్శిస్తే అడ్రస్ లేకుండా పోతారని నాయిని మండిపడ్డారు. ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన సీపీఎం, సీపీఐ కార్యకర్తలు తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా, రేవంత్పై నాయిని వ్యక్తిగత విమర్శలకు దిగారు.
''ఇవాళ ఎవరో ఏదో మాట్లాడితే మనం మాట్లాడేదేం లేదు. ఇహ, వాని గురించి (రేవంత్ ను ఉద్దేశించి) ఎందుకు మాట్లాడతరో మీరు (కార్యకర్తలను)... ఊకే 'రేవంత్ రేవంత్ రేవంత్' అంట్రుండ్రు...అనవసరంగ వాణ్నో పెద్ద లీడర్ చేస్తున్నం మనం. ఆడు బచ్చాగాడు. ఆ బచ్చాగాణ్ని గురించి మనం ఊకే ఎక్కువ మాట్లాడటం అనవసరం.
ఆనితో ఎవడో అన్నాడంట.. నువు ముఖ్యమంత్రి అయితవని. ఇగ దాన్ని పట్టుకుని వాడు ఓ..ఎగురుతా ఉన్నడు.. పొట్టోడు. వాని కల కలగానే ఉంటది. కలల వస్తే అది (ముఖ్యమంత్రి పదవి) రాదు, నిజం గాదు’’ అని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.
‘‘కేసీఆర్ని తిడితే ఎవడో పెద్ద లీడరైతననుకుంటే అది భ్రమ. కేసీఆర్ని తిట్టినోడు అడ్రస్ లేకుండపోతడని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కేసీఆరు ఆయన సొంతం కొరకేం జేస్తలేడు’’ అని నాయిని స్పష్టం చేశారు.