నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం బ్రదర్స్పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. ఆనం బ్రదర్స్ మంచివారంటూ కితాబిచ్చారు. ఈ జిల్లాలో సీనియర్ నేతలుగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి అనుచరులు రెండు వేల మంది ఆదివారం టీడీపీలో చేరారు.
విజయవాడ ఏ1 కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ... ఆనం బ్రదర్స్, అనుచరులను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ స్వలాభం కోసం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిందని విమర్శించారు. హేతుబద్ధత లేని విభజన వల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం అనేక సమస్యలు ఉన్నాయని... భావితరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని నాయకులకు సూచించారు. కష్టాలను సమర్థంగా ఎదుర్కొంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వివరించారు. కష్ట సమయంలోనూ రైతుల రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. రాష్ట్ర మంత్రులు నారాయణ, దేవినేని ఉమామహేశ్వరావు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, వివేకానందరెడ్డి, పలువురు తెదేపా నేతలు పాల్గొన్నారు.