ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ప్రభుత్వం 2014-15 సంవత్సరానికి భారీ బడ్జెట్ను ప్రతిపాదించింది. రాష్ట్రాన్ని ‘స్వర్ణాంధ్ర’గా రూపొందించేందుకు మార్గం వేస్తూ బడ్జెట్ను రూపొందించామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు.
రాష్ట్ర వార్షిక బడ్జెట్ 1,11,824 కోట్లు కాగా, ఇందులో ప్రణాళికా వ్యయం 26,673 కోట్లని, ప్రణాళికేతర వ్యయం 85,151 కోట్ల రూపాయలని మంత్రి తెలిపారు. శాసనసభకు బుధవారం ఆయన వార్షిక బడ్జెట్ను సమర్పించిన సంగతి తెలిసిందే.
2014-15 సంవత్సరంలో రెవెన్యూ లోటు 6,064 కోట్లుగా, ద్రవ్యలోటు 12,064 కోట్ల రూపాయలుగా ఉంటుందని యనమల తెలిపారు. స్థూల జాతీయ ఉత్పత్తిలో ద్రవ్యలోటు (ఆర్థికలోటు) 2.30 శాతం, రెవెన్యూ లోటు 1.16 శాతంగా ఉంటుందని ప్రకటించారు.