ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన శాఖలపై సమీక్షలు చేస్తూనే మరోవైపు ఏమాత్రం ఖాళీ దొరికినా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తన ఛాంబర్ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు మంగళగిరి పార్టీ కేంద్రానికి వచ్చారు. బాధితులను డిప్యూటీ సీఎం నేరుగా కలుసుకుని వారి సమస్యలను విన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వారి దృష్టి తీసుకెళ్లారు.
ఓ బాధిత మహిళ తమ బిడ్డ కిడ్నాప్ కు గురై 9 నెలలైందని పవన్ కల్యాణ్ ముందు బోరుమంటూ విలపిస్తూ చెప్పింది. వెంటనే డిప్యూటీ సీఎం పవన్ సంబంధిత పోలీసు స్టేషనుకి ఫోన్ చేస్తూ... హలో సీఐ సర్, ఆడబిడ్డ మిస్ అయి 9 నెలలైందట, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసారట. కానీ బిడ్డ ఆచూకి ఇంతవరకూ తెలియలేదు. వెంటనే కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేయండి'' అంటూ ఆదేశించారు.