Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ‌న్న‌వ‌రంను మ‌చిలీప‌ట్నంలో కాకుండా, విజ‌య‌వాడ జిల్లాలో క‌ల‌పండి

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (17:57 IST)
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ లో లయన్స్ క్లబ్ కల్యాణ మండపంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నందిగం వెంకటేశ్వరరావు అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గంలోని విజయవాడ రూరల్ మండలంతోపాటు బాపులపాడు, ఉంగుటూరు మండలాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కాకుండా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కలపాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. 
 
 
ఈ సమావేశంలో పాల్గొన్న అఖిలపక్ష కార్యాచరణ కమిటీ కన్వీనర్,సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ, జాతీయ రహదారి 16 కు అనుకుని గన్నవరం నియోజకవర్గంలోని విజయవాడ రూరల్ మండలం విజయవాడలో అంతర్భాగంగా ఉందని గన్నవరం,ఉంగుటూరు, బాపూలపాడు మండలాలు కూడా అతి సమీపంలో విజయవాడకు దగ్గరగా ఉన్నాయని తెలిపారు. ఈ పరిస్థితిలో గన్నవరం నియోజకవర్గానికి చాలా దూరం లో ఉన్న మచిలీపట్నం కేంద్రంగా ఏర్పాటు చేసే కృష్ణా జిల్లాలో కలపడం సహేతుకం కాదన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించి కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక జిల్లాకు 8 అసెంబ్లీ నియోజకవర్గాలు మరొక జిల్లాకు 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన మాదిరిగా కృష్ణా జిల్లాలో కూడా ప్రజల సౌకర్యార్థం చేయాల‌న్నారు. విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసే ఎన్టీఆర్ జిల్లాలో గన్నవరంలోని నాలుగు మండలాలు చేర్చి విజయవాడ జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు, మచిలీపట్నం కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేటట్లు చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 
 
మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు తోట మురళీధర్ మాట్లాడుతూ, విజయవాడలో అంతర్గతంగా ఉన్న గన్నవరం నియోజకవర్గాన్ని ఎక్కడో 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం జిల్లాలో కలపటం అర్థరహితమని అట్లాగే గన్నవరంలోని 4 మండలాలను గుడివాడ రెవిన్యూ డివిజన్ లో కాకుండా విజయవాడ రెవెన్యూ డివిజన్ లో కలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 
 
రాష్ట్ర తెలుగురైతు కార్యనిర్వాహక కార్యదర్శి గుండపనేని  ఉమా వర ప్రసాద్ మాట్లాడుతూ 1987లోనే అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తాలూకా వ్యవస్థలను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకువచ్చార‌ని చెప్పారు. పాలనను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చారని అట్లాగే ప్రస్తుత ప్రభుత్వం కూడా పాలన వికేంద్రీకరణ లో భాగంగా గన్నవరం నియోజకవర్గాన్ని మచిలీపట్నం జిల్లాలో చేర్చి ప్రజలకు పాలనను దూరం చేయడం అర్థరహితం అన్నారు.
 
 
మండల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ అవిర్నేని శేషగిరిరావు మాట్లాడుతూ, కృష్ణా జిల్లాను రెండు జిల్లాలుగా విభజించటం, ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం స్వాగతిస్తున్నామన్నారు. గన్నవరం నియోజకవర్గం విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాలో చేర్చడానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
 
ఈ సమావేశంలో మండల జనసేన నాయకులు చలమలశెట్టి రమేష్ బాబు, మండల కాంగ్రెస్ నాయకులు పడకల శ్రీనివాసరావు ,యుటిఎఫ్ నాయకులు అక్కినేని రాఘవేంద్రరావు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అట్లూరి శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రముఖులు కళ్లేపల్లి నారాయణ రావు, వేమూరి సురేంద్ర,వడ్డీ నాగేశ్వరరావు ,గూడపాటి రత్న శేఖర్, కె.సాయి రామ్ తదితరులు పాల్గొన్నారు.
 
 
ఇదే సమావేశంలో జాతీయ రహదారి 16 పై వేలేరు  అడ్డరోడ్డు దగ్గర హనుమాన్ జంక్షన్ ప్రజల సౌకర్యార్థం అండర్ పాస్ ఏర్పాటు చేయాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ నేషనల్ హైవే విజయవాడ వారిని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments