ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులను అప్పుల ఊబినుంచి గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రైతు రుణమాఫీ పథకం అంటే జగన్ మోహన్ రెడ్డి ఏమాత్రం ఇష్టం లేనట్టుగా ఉందని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రైతు రుణమాఫీపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఎన్నికల నాడు చంద్రబాబు చేసిన వాగ్ధానాలకు, తాజాగా అమలవుతున్న రుణమాఫీకి ఎక్కడా పొంతన లేదని ఈ సందర్భంగా జగన్ ఆరోపించారు.
జగన్ ఆరోపణలపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. రుణమాఫీపై మాట్లాడే హక్కు జగన్ మోహన్ రెడ్డికి లేదన్నారు. ఎన్నికల సందర్భంగా రుణమాఫీ అసాధ్యమని ప్రకటించిన జగన్కు, రుణమాఫీపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జగన్ అవినీతి భాగోతంపైనా అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. దీంతో అధికార, విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.