టీడీపీ మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర రావు అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి. హైదరాబాద్, బన్సీలాల్పేటలోని హిందూ శ్మశానవాటికలో ఇవి జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, టీడీపీ మాజీ మంత్రి అయిన శ్రీపతి రాజేశ్వర్రావు (72) మూత్రపిండ సంబంధింత వ్యాధికి హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసిన విషయం తెల్సిందే.
కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన రెండురోజుల క్రితం నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని కంటోన్మెంట్ బోర్డు 5వ వార్డులోని సింహపురి కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఉంచారు.
సోమవారం ఉదయం అంతిమయాత్ర జరుగుతుందనీ, బన్సీలాల్పేట హిందూస్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయనీ కుటుంబ సభ్యులు వెల్లడించారు. సికింద్రాబాద్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన రాజేశ్వర్... ఎన్టీ రామారావు క్యాబినెట్లో రెండు సార్లు మంత్రిగా పనిచేశారు.
1962 లో అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని స్థాపించడంతో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకమునుపునుంచే ఆయనతో శ్రీపతికి సత్ సంబధాలు ఉండేవి. 1982లో ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరిన ఆయన... 1983లో తొలిసారి ముషీరాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా కూడా పని చేశారు. తన జీవితమంతా టీడీపీకే అంకితం చేశారు.