Publish Date: Wed, 02 Oct 2019 (16:19 IST)
Updated Date: Wed, 02 Oct 2019 (16:43 IST)
క్రికెటర్ శ్రీశాంత్ చెన్నై సూపర్ కింగ్స్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాసుల వర్షం కురిపించే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంటే తనకు అసహ్యమని చెప్పాడు. ఇందుకు బలమైన కారణం వుందని శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు.
నిజానికి మహేంద్ర సింగ్ ధోని, శ్రీనివాసన్ వల్లే తాను ఆ జట్టుపై కోపంతో ఉన్నానని అందరూ అనుకుంటారని, కానీ తనకు పసుపు రంగు అంటే అస్సలు నచ్చదని.. అందుకే ఆ జట్టు అంటే కోపం అని చెప్పాడు.
చెన్నై జట్టుపై తాను ఆడతానని ఆప్టన్ను తాను చాలా సార్లు కోరానని, ఎందుకంటే ఆ జట్టుపై తనకు మంచి రికార్డు ఉందని తెలిపాడు. ఆప్టన్ను తాను దూషించానన్న ఆరోపణలు మానసికంగా బాధించాయని.. పోలీసుల టార్చర్ కన్నా దుర్భరంగా అనిపించాయని వెల్లడించాడు.
అదే రంగు జెర్సీ వేసుకునే ఆస్ట్రేలియా జట్టును కూడా అసహ్యించుకుంటానని శ్రీశాంత్ వివరణ ఇచ్చాడు. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న శ్రీశాంత్.. రాజస్థాన్ కోచ్ పాడీ ఆప్టన్ తన ఆటోబయాగ్రఫీలో అతడిపై చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చాడు. చెన్నై జట్టుపై శ్రీశాంత్ను ఆడించకపోవడం వల్ల తనను దూషించడని ఆప్టన్ పేర్కొన్నాడు.
కానీ ఆప్టన్ వ్యాఖ్యలపై శ్రీశాంత్ మాట్లాడుతూ.. మిస్టర్ ఆప్టన్ మీ గుండె, పిల్లలపై చేయి వేసుకొని చెప్పండి. మిమ్మల్నెప్పుడైనా దూషించానా? అని అడిగాడు. తాను ఎంతగానో అభిమానించే రాహుల్ ద్రవిడ్ను కూడా ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నేనెప్పుడైనా ఆప్టన్తో గొడవ పడ్డానా అంటూ ప్రశ్నించాడు.