Publish Date: Fri, 20 Sep 2019 (13:08 IST)
Updated Date: Fri, 20 Sep 2019 (13:09 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైరయ్యే సమయం ఆసన్నమైందని లెజండరీ బ్యాట్స్మన్, మాజీ సారథి సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడి మీదున్న గౌరవంతో చెప్తున్నానని.. ధోనీ టైమ్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు.
గౌరవప్రదంగా ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడం మంచిదని సూచించాడు. ధోనీకి ఉద్వాసన చెప్పాలని మేనేజ్మెంట్ భావించకముందే.. అతనే గౌరవంగా తప్పుకుంటే బాగుంటుందని సూచించాడు. ధోనీకి లక్షలాది మంది అభిమానులున్నారు.
వాళ్లలో నేనూ ఒకడిని. అందుకే అతడి మీద గౌరవంతో చెబుతున్నా.. ధోనీ టైమ్ అయిపోయింది. అతడి నిర్ణయం కోసం మేనేజ్మెంట్ ఎదురుచూస్తోంది. వచ్చే టీ-20 ప్రపంచకప్ సమయానికి ధోనీ వయసు 39 ఏళ్లు.
ఈ వయసులో క్రికెట్ ఆడడం చాలా కష్టం. అందువల్ల ధోనీయే గౌరవంగా తప్పుకుంటే మంచిదని గవాస్కర్ వ్యాఖ్యానించారు. ఉద్వాసన పలికే అవసరం రాకుండా ధోనీయే గౌరవంగా వీడ్కోలు చెబుతాడని భావిస్తున్నానని గవాస్కర్ తెలిపాడు.
మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్పై దిగ్గజ క్రికెటర్లు స్పందించడం ఇది తొలిసారి కాదు. ఇదే విషయమై ఇటీవల అనిల్ కుంబ్లే మాట్లాడుతూ.. ధోనీ లాంటి గొప్ప ఆటగాడికి గొప్ప వీడ్కోలు లభించాల్సిన అవసరం ఉంది కానీ.. ఇలా ఊగిసలాటల మధ్య అతడి కెరీర్ సాగకూడదంటూ కుంబ్లే చేసిన కామెంట్స్ అప్పట్లో చర్చనియాంశమైన సంగతి తెలిసిందే.