Publish Date: Mon, 30 Sep 2019 (11:19 IST)
Updated Date: Mon, 30 Sep 2019 (12:37 IST)
టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్.. పాకిస్థాన్ క్రికెటర్లకు గట్టి షాకిచ్చే కామెంట్స్ చేశాడు. పాకిస్తాన్ క్రికెటర్లకు కౌంటర్ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. కాశ్మీర్ మీద షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలకు ఈ ఏడాది ఏప్రిల్లో కూడా కౌంటర్ ఇచ్చాడు. కాశ్మీర్ విషయంలో బయటివారి సలహాలు అవసరం లేదని అప్పట్లోనే కౌంటర్ ఇచ్చాడు.
తాజాగా భారత్ విషయంలో పదే పదే సూచనలు చేసే పాకిస్థాన్ క్రికెటర్లకు ధావన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. పాకిస్థాన్ క్రికెటర్లు భారత్ అంతర్గత విషయాల్లో సలహాలు ఇవ్వడం మానేసి.. వారి సొంత దేశంలోని సమస్యల సంగతి చూసుకుంటే మంచిదన్నాడు.
ఎవరైనా మన దేశం గురించి మాట్లాడితే గట్టిగా నిలబడాలి. బయటివారి సలహాలు అవసరం లేదు. మొదట వారి దేశంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుని ఆ తర్వాత ఇతరులకు సలహాలిస్తే మంచిదని శిఖర్ ధావన్ హితవు పలికాడు. అద్దాల భవనంలో ఉండేవారు ఇతరుల మీదకు రాళ్లేయకూడదని ధావన్ సూచించాడు.
అలాగే ధోనీ రిటైర్మెంట్పై కూడా శిఖర్ ధావన్ స్పందించాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్పై చర్చ అనవసరమని తేల్చేశాడు. క్రికెట్ నుండి ఎప్పుడు వైదొలగాలో ధోనీకి బాగా తెలుసు అంటూ కామెంట్ చేశాడు. గత కొద్దికాలంగా పేలవ ఫామ్తో సతమతమవుతున్న ధోనీపై విమర్శల వర్షం కురుస్తోన్న నేపథ్యంలో.. ఎన్నో సంవత్సరాలుగా ధోనీ క్రికెట్ ఆడుతున్నాడు.
ఎప్పుడు క్రికెట్ నుండి తప్పుకోవాలో అతడికి తెలుసు. రిటైర్మెంట్ అనేది తన సొంత నిర్ణయం. జట్టు కోసం మహీ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. క్రికెట్ నుంచి తప్పుకునే సరైన సమయం వచ్చినపుడు అతడు కచ్చితంగా గుడ్బై పలుకుతాడు. ధోనీ రిటైర్మెంట్పై చర్చ అనవసరనని చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ భారత జట్టులో అడుగుపెట్టినప్పుడు ధోనీ అతడికి ఎంతో సహకరించాడు.
అతడు కెప్టెన్ అయిన తర్వాత కూడా అండగా నిలిచాడు. గొప్ప నాయకుడి స్వభావం ఇలానే ఉంటుంది. కోహ్లీ కూడా ధోనీకి ఎంతో గౌరవం ఇవ్వడం గొప్ప విషయమని వెల్లడించాడు.