Publish Date: Fri, 16 Aug 2019 (17:16 IST)
Updated Date: Fri, 16 Aug 2019 (17:17 IST)
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ ఏ రకమైందంటూ కోర్టు ప్రశ్నించింది. ఎంఎల్ శర్మ మాత్రం ఈ పిటిషన్ను దాఖలు చేశారు.
జమ్మూ కాశ్మీర్ విషయంలో కేంద్రానికి మరింత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అరగంట పాటు పరిశీలించినా కూడ తనకు పిటిషన్ అర్థం కాలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్పై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పిటిషన్లో స్పష్టత లేదని కోర్టు అభిప్రాయపడింది.
ఈ సందర్భంగా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ కాశ్మీర్లో పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నాయని, జిల్లాల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దశలవారీగా ఆంక్షలు తొలగిస్తామని కోర్టుకి వివరించారు. ఈ అంశంలో కేంద్రానికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించిన ధర్మాసనం మరోసారి దీనిపై విచారిద్దామని వాయిదా వేసింది. తేదీ మాత్రం ఖరారు చేయలేదు.