Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు...

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు...
, సోమవారం, 18 నవంబరు 2019 (09:29 IST)
దేశ పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశంలో అత్యంత కీలక బిల్లులకు ఆమోదముద్ర వేయించుకునేలా అధికార బీజేపీ వ్యూహాలు రచించింది. ముఖ్యంగా, పౌరసత్వ (సవరణ) బిల్లు వంటి పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. 
 
మరోవైపు, ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, జమ్ముకాశ్మీర్‌లో పరిస్థితులు తదితర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం, విపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటుండటంతో చర్చలు వాడివేడిగా సాగనున్నాయి. ఈ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 
 
ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న రెండో పార్లమెంట్‌ సమావేశాలు ఇవి. బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తక్షణ ట్రిపుల్‌ తలాక్‌ రద్దు, జమ్ముకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వంటి పలు కీలక బిల్లులను ఆమోదింపజేసుకున్న సంగతి తెలిసిందే.
 
మరోవైపు, ఈ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం 35కు పైగా బిల్లులను ప్రవేశపెట్టనున్నది. ప్రస్తుతం పార్లమెంట్‌లో 43 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఏడింటిని వెనక్కి తీసుకోనున్నది. మిగతావాటిలో 12 బిల్లులపై చర్చ, ఓటింగ్‌ జరుపనున్నది. మరో 27 బిల్లులను సభలో ప్రవేశపెట్టి, చర్చించిన తర్వాత ఓటింగ్‌ నిర్వహించనున్నది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముగిసిన రంజన్ గొగోయ్ పదవీకాలం.. నేడు సీజేఐగా బాబ్డే