Publish Date: Wed, 25 Sep 2019 (14:05 IST)
Updated Date: Wed, 25 Sep 2019 (14:59 IST)
హాస్య నటుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నవ్వులు పూయించిన వేణు మాధవ్ మరణం తెలుగు సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన సెప్టెంబరు 6వ తేదీన యశోధ ఆసుపత్రిలో చేరారు. కాలేయంతో పాటు రెండు కిడ్నీలు కూడా దెబ్బతినడంతో ఆయన పరిస్థితి క్షీణించింది. దీంతో బుధవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
హాస్యనటుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో నటించి నవ్వించిన వేణు మాధవ్ నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగానూ ఎదగాలని భావించారు. ఇందుకుగాను తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ గెలుపు కోసం ప్రచారం కూడా నిర్వహించారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి తన సొంత నియోజకవర్గం కోదాడ నుంచి పోటీ చేయాలనుకున్నారు.
ఇందుకోసం తెలుగుదేశం అధినాయకత్వాన్ని ఒప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనకు సీటు రాలేదు. దీనితో 2018లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నామినేషన్ కూడా వేశారు. కానీ నామినేషన్ పత్రాలు సరిగా లేవంటూ ఎన్నికల అధికారి తిరస్కరించారు. అలా ఆయన కోరుకున్నది నెరవేరకుండానే కన్నుమూశారు.