Publish Date: Sun, 19 Jan 2020 (13:50 IST)
Updated Date: Sun, 19 Jan 2020 (13:52 IST)
రాజకీయాలు, సమాజం చెడు మార్గంలో వెళుతోన్న సమయంలో ప్రజల సంక్షేమం కోసం మీడియాపై చాలా బాధ్యత ఉంటుందని సినీనటుడు రజనీకాంత్ చెప్పారు. చెన్నైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ మాట్లాడుతూ... మీడియా ఎవరి పక్షాన ఉండకుండా తటస్థంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొన్ని టీవీ ఛానళ్లు కొన్ని రాజకీయ పార్టీల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయన్నారు.
మీడియా, విమర్శకులు, జర్నలిస్టులు నిష్పక్షపాతంగా నిజాన్ని చెప్పాలని రజనీకాంత్ కోరారు. సత్యంతో కూడిన వార్తని పాలతో... అసత్యాలతో కూడిన వార్తని ఆయన నీళ్లతో... పోల్చారు. ఈ పాలు, నీళ్లను కలిపి చూపెడితే ఈ రెండింటి మధ్య తేడాలను ప్రజలు గుర్తించలేరని తెలిపారు. సత్యమేదో అనే విషయాన్నే మీడియా తెలపాలని, నిజం, అబద్ధం.. రెండింటినీ కలిపి అసత్యాన్ని నిజం చేసి చూపకూడదని పేర్కొన్నారు.