మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం చెర్రీ యువ దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో "పెద్ది" చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇది 2026 మార్చి 27వ తేదీన విడుదలకానుది. ఈ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ - చెర్రీ కాంబినేషన్లో చిత్రం తెరకెక్కనుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో ఒక సినిమాపై ఇప్పటికే అధికారిక ప్రకటన ఉంది. ఈ మూవీతో పాటే త్రివిక్రమ్ సినిమా కూడా పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్.. విక్టరీ వెంకటేష్తో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. దీని తర్వాత చెర్రీ సినిమాను ప్లాన్ చేసినట్టు సమాచారం. వచ్చే యేడాది ఈ ఇద్దరి కాంబినేషన్లో మూవీ పట్టాలెక్కనున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు కూడా ప్రారంభంగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించేందుకు చెర్రీ సైతం సమ్మతం తెలిపినట్టు వినికిడి.
ఇకపోతే, ఈ మెగా కాంబోపై అధికారిక ప్రకటన కోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, రామ్ చరణ్ నటన కలగలిసి ఒక అద్భుతమైన సినిమా వస్తుందని సినీ ప్రియులు ఆశిస్తున్నారు.