Publish Date: Mon, 13 Dec 2021 (09:33 IST)
Updated Date: Mon, 13 Dec 2021 (09:35 IST)
తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీల అంశంపై చర్చ సాగుతోంది. పదోన్నతి లభించినా ప్రస్తుతం చాలామంది పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. దీంతో ఐఏఎస్ అధికారుల్లో చాలామంది అదనపు బాధ్యతలు నిర్వరిస్తున్నారు.
కొన్ని చోట్ల కిందిస్థాయి అధికారులు ఇన్ఛార్జ్లుగా వ్యవహరిస్తున్నారు. మరికొన్ని చోట్ల కీలక శాఖలకు పూర్తిస్థాయి అధికారులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో మిగతా అధికారుల బదిలీలు కూడా ఉంటాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో 14 తర్వాత IAS, IPSల బదిలీలు వుంటాయని తెలుస్తోంది.
వరుస ఎన్నికల నేపథ్యంలో బదిలీల ప్రక్రియ కొంత ఆలస్యమైందని అధికార వర్గాల సమాచారం. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 10న పూర్తయింది. 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కోడ్ ముగియగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఈ దిశగా ఇప్పటికే కొంత కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.
కొన్ని జిల్లాల కలెక్టర్లు సహా సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు ఉంటాయని, అదనపు బాధ్యతల్లో ఉన్న పలు పోస్టులకు పూర్తి స్థాయిలో అధికారులను నియమించే అవకాశముందని తెలుస్తోంది.