Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమ పెళ్లికి నిరాకరించి పెంపుడు తల్లిని చంపిన విశ్వాసఘాతుకురాలు

ప్రేమ పెళ్లికి నిరాకరించి పెంపుడు తల్లిని చంపిన విశ్వాసఘాతుకురాలు
, ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (08:31 IST)
హైదరాబాద్ నగరంలో ఓ యువతి విశ్వాసఘాతుకానికి పాల్పడింది. పెంపుడు తల్లినే పాశవికంగా హత్య చేసింది. ప్రేమ పెళ్లికి నిరాకరించిన ఆ యువతి... చివరకు పెంపుడు తల్లిని చంపేసింది. హత్యకు గురైన మహిళది మన దేశం కాదు. మన మతం కాదు. అయినప్పటికీ గత మూడు దశాబ్దాలుగా పేదలు, అనాథలను అక్కున చేర్చుకుని సేవ చేస్తూవస్తోంది. అలాంటి మహిళ పెంచిన యువతే వెన్నుపోటు పొడిచి హత్య చేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఫ్రాన్స్‌కి చెందిన మేరీ క్రిస్టీనా(68).. తన కుమార్తెలు మేరీ సొలాంగ్‌, రెబెకాలను తీసుకొని 3 దశాబ్దాల క్రితం హైదరాబాద్‌ వచ్చారు. గండిపేట్‌ మండలం, దర్గాఖలీజ్‌ఖాన్‌ కాలనీలో స్థిరపడ్డారు. మేరీ సొలాంగ్‌ ప్రశాంత్‌ను పెళ్లాడి సమీపంలోని సన్‌సిటీలో నివసిస్తోంది. మరో కుమార్తె పుదుచ్చేరిలో ఉంటోంది.
 
ఈ క్రమంలో ఒంటరిగా ఉంటున్న క్రిస్టినా అనాథలైన రోమా(24), ప్రియాంకలను ఇంట్లో ఉంచుకుని పోషిస్తోంది. రోమాకు పెళ్లి చేయాలనుకుని సంబంధాలు చూస్తోంది. అయితే, రోమా అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన విక్రమ్‌ శ్రీరాములు(25)తో ప్రేమలో పడింది. పెంపుడు తల్లికి తెలియకుండా కొండాపూర్‌లో అద్దె ఇంట్లో అతనితో సహజీవనం చేస్తోంది. 
 
రోమా ప్రవర్తనపై అనుమానం రావడంతో మేరీ మందలించింది. బొటిక్‌  పెట్టుకుంటానని రూ.2 లక్షలు ఇవ్వాలని రోమా ఒత్తిడి చేయగా.. ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో క్రిస్టీనాను హత్యచేసి, ఆమె ఖాతాలోని నగదును చేజిక్కించుకోవాలని ప్రియుడు విక్రమ్‌, అతని పాత స్నేహితుడు నెల్లూరు వాసి రాహుల్‌గౌతమ్‌(24)తో కలిసి రోమా పథకం పన్నింది. 
 
ఈ నెల 8న సాయంత్రం మేరీ తన కారులో టోలీచౌకి స్కూల్‌కు వెళ్లి రోమాను అక్కడ వదిలి తిరిగి ఇంటికి చేరుకుంది. ముందస్తు ప్రణాళిక ప్రకారం విక్రమ్‌, రాహుల్‌ ఆమె ఇంటి వద్ద కాపు కాశారు. కారును ఇంటిలో పార్కింగ్‌ చేయగానే మేరీపై విక్రమ్‌, రాహుల్‌ దాడిచేసి తాడుతో మెడకు ఉరి బిగించారు. మేరీ మృతదేహాన్ని ఆమె కారులోనే వేసుకుని హిమాయత్‌సాగర్‌ సమీప పొదల్లో పడేశారు. 
 
అదే కారులో ఆమె ఇంటికి వచ్చి.. ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోను తీసుకుని పరారయ్యారు. మర్నాడు మేరీ బ్యాంక్‌ఖాతా నుంచి రూ.రెండు లక్షలను రోమా తన ఖాతాలోకి మళ్లించుకుంది. మేరీ సెల్‌ఫోను మూగబోవడంతో కుమార్తె మేరీ, ప్రశాంత్‌ దంపతులు రాజేంద్రనగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదు చేశారు. రోమా కదలికలపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టు రట్టయింది. రోమా, విక్రమ్‌, రాహుల్‌ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీట్ (NEET) ఎక్షామ్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు