Publish Date: Wed, 04 Sep 2024 (18:33 IST)
Updated Date: Wed, 04 Sep 2024 (18:49 IST)
ఇటీవలి రోజులలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలలో తీవ్ర వరదలు సంభవించాయి. ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు మరింత నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలో సుడిగాలి తుఫాను కారణంగా 1 లక్షకు పైగా చెట్లు నేలకూలాయి. ఆగస్ట్ 31న ఈ ఘటన జరిగినా చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. ఆగస్టు 31న సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య సంబంధిత ప్రాంతంలో భారీ గాలులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.
దీంతో ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామం నుంచి తాడ్వాయి మండలం గోనెపల్లి గ్రామం వరకు 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న చెట్లు నేలకొరిగాయి. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాలను పంపాలని, ఈ ప్రాంతంలో చెట్లను పునరుద్ధరించడానికి అవసరమైన నిధులు కేటాయించాలని కేబినెట్ మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.