Publish Date: Wed, 04 Sep 2024 (16:04 IST)
Updated Date: Wed, 04 Sep 2024 (16:06 IST)
పొరుగు రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్, బఫర్ల జోన్ల పరిరక్షణమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన హైడ్రా అభినందనీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైడ్రా లాంటివి ప్రతి రాష్ట్రంలో ఖచ్చితంగా ఉండాలని తెలిపారు. ఇప్పటికే కట్టిన భవనాలకు పరిహారం ఇచ్చి కూల్చివేయాలని, ఆ విషయంలో మానవతా కోణంలో కూడా చూడాలని అన్నారు.
నిజంగా సీఎం రేవంత్రెడ్డి చెరువుల విషయంలో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. అసలు అక్రమ నిర్మాణాలు అనేవి జరగకుండా అడ్డుకుంటే ఎలాంటి సమస్యలు ఉపద్రవాలు రావని అన్నారు.
వరద రావడం లేదనే ఉద్దేశంతో తెలంగాణలోనే కాక ఏపీలో కూడా ఎంతో మంది పరివాహక ప్రాంతాలను ఆక్రమించి ఇళ్లు కట్టుకున్నారని పవన్ చెప్పారు. ఇందుకు ఒకరు కారణం కాదని.. ఎంతో మంది వ్యక్తులు ఎన్నో ఏళ్లుగా ఇలా ఆక్రమణలకు పాల్పడడం వల్లే ప్రస్తుతం వరదలు వస్తున్నాయని పవన్ కల్యాణ్ అన్నారు.