Hyderabad Central University
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పోరు బాట పట్టారు. హెచ్సీయూలోని 400 ఎకరాల భూముల విక్రయంపై ఆందోళన సాగిస్తున్న విద్యార్థుల్లో రేవంత్ రెడ్డి ప్రసంగం అగ్గికి ఆజ్యం పోసినట్టయ్యింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏముంటాయి గుంటనక్కలు ఉంటాయంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ భూముల అమ్మకంపై అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ క్యాంపస్లో 200 మందికి పైగా పోలీసులు మోహరించారు. 400 ఎకరాల యూనివర్సిటీ భూమి విక్రయించడానికి తాము అంగీకరించమంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
అనంతరం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తీసుకువచ్చి దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. ఇరు వర్గాల పెనులాగటలో దిష్టిబొమ్మను ఎట్టకేలకు యూనివర్సిటీ విద్యార్థులు లాక్కుని దగ్ధం చేశారు. తమ యూనివర్సిటీ భూముల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ విద్యార్థులు హెచ్చరించారు.