తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. అయితే, పలు ప్రాంతాల్లో ప్రశ్నపత్రం లీకవుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల నల్గొండ జిల్లాలో ఈ ప్రశ్నపత్రం లీక్ అయింది. తాజాగా కామారెడ్డి జిల్లా జుక్కల్లో బుధవారం ప్రశ్నపత్రం లీకైంది. పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహించే సిబ్బంది కొన్ని ప్రశ్నలను తెల్లకాగితంపై రాసి బయటకు పంపించారు. ఈ ఘటన జుక్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది.
పరీక్షకు కొన్ని నిమిషాల ముందు కొన్ని ప్రశ్నలను కాగితంపై రాసి బయటకు పంపించారు. ఆ ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ భీమ్, ఇన్విజిలేటర్ దీపికను పరీక్షా విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కాగా, నల్గొండలో జరిగిన ప్రశ్నపత్రం లీకేజీ కేసులో పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, ఓ బాలికను డీబార్ చేశారు.