Publish Date: Sat, 25 Apr 2020 (23:09 IST)
Updated Date: Sat, 25 Apr 2020 (23:12 IST)
ఆ శ్రీకృష్ణ పరమాత్మ లీలలు గురించి తెలుసుకుంటుంటే ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంటుంది. నల్లనయ్య తన బాల్యంలో వుండగా ఒకనాడు పర్వతమంతటి ఆకారంలో ఉన్న కొంగ ఒకటి గోవులను, వాటిని కాస్తున్న గోప బాలురను మింగసాగింది. చిన్నికృష్ణుడిని కూడా తన ముక్కున కరచుకుని మింగేందుకు ప్రయత్నించింది. ఐతే ఎంతకూ మింగుడు పడని కృష్ణుడిని బయటకు కక్కేసింది. మళ్లీ మరోసారి మింగేందుకు వస్తున్న ఆ కొంగను(బకాసురుడు) కృష్ణుడు ముక్కును పట్టుకుని విరిచి చంపేశాడు. దేవతలు కృష్ణునిపై పూలవర్షం కురిపించారు.
ఈ బకాసురుడు పూర్వజన్మలో హయగ్రీవుడనే రాక్షసుని కుమారుడైన ఉత్కళుడు. దేవేంద్రుడిని జయించి వంద సంవత్సరాలు ఇంద్ర పదవిలో ఉన్నటువంటివాడు. ఈ ఉత్కళుడు ఓసారి జాబాలి ఆశ్రమ ప్రాంతంలో చేపలను పట్టిన కారణంగా కొంగగా పుట్టేట్లు జాబాలి చేత శాపం పొందుతాడు. దీంతో ఉత్కళుడు పశ్చాత్తాపం చెందగా ద్వాపరాంతంలో కృష్ణుని చేత చంపబడి ముక్తినొందుతావని పరిహారం చెపుతాడు. ఆ కారణంగా ఉత్కళుడు బకాసురుడుగా జన్మించి శ్రీకృష్ణుని చేతిలో హతుడవుతాడు.