Publish Date: Fri, 28 Feb 2020 (19:58 IST)
Updated Date: Fri, 28 Feb 2020 (19:59 IST)
మనసుతో జ్ఞానేంద్రియాలను స్వాధీనంలో ఉంచుకొని, కర్మేంద్రియాల ద్వారా నిష్కామ కర్మ చేస్తున్నవాడు ఉత్తమడు అని చెప్పాడు గీతలో శ్రీకృష్ణుడు. ఆ పరమాత్ముడు చెప్పినవి మరికొన్ని. నీ కర్తవ్యకర్మ నీవు ఆచరించవలసిందే. కర్మలు విడిచి పెట్టడం కంటే చేయడమే శ్రేయస్కరం. కర్మలు చేయకుండా నీవు జీవనయాత్ర కూడా సాగించలేవు.
యాగ సంబంధమైనవి తప్ప తక్కిన కర్మలన్నీ మానవులకు సంసారబంధం కలగజేస్తాయి. కనుక ఫలాపేక్ష లేకుండా దైవప్రీతి కోసం కర్మలు ఆచరించు. ఇలా తిరుగుతున్న జగత్ చక్రాన్ని అనుసరించని వాడు పాపి. ఇంద్రియ లోలుడు. అలాంటి జీవితం వ్యర్థం. ఆత్మలోనే ఆసక్తి, సంతృప్తి, సంతోషం పొందేవాడికి విద్యుక్త కర్మలేవీ ఉండవు.
ఉత్తముడు చేసిన పనినే ఇతరులు అనుకరిస్తారు. అతను నెలకొల్పిన ప్రమాణాలనే లోకం అనుసరిస్తుంది. ముల్లోకాలలోనూ నేను చేవలసిన పని ఏమీ లేదు. నాకు లేనిది కానీ, కావల్సింది కానీ ఏమీ లేకపోయిప్పటికీ లోక వ్యవహారాలు నిత్యమూ నిర్వర్తిస్తూనే ఉన్నాను.
నేను కర్మలు ఆపివేస్తే ప్రజలంతో భ్రష్టులైపోతారు. రకరకాల సంకరాలకు, ప్రజల నాశనానికి నేనే కర్తనవుతాను. అజ్ఞానులు ఫలితాలను ఆశించి కర్మలు చేసినట్లే ఆత్మజ్ఞానులు ఫలాపేక్ష లేకుండా లోక కల్యాణం కోసం కర్తవ్య కర్మలు ఆచరించాలి. ప్రకృతి గుణాల వల్ల సర్వకర్మలూ సాగుతుండగా, అజ్ఞాని అహంకారంతో కర్మలు తానే చేస్తున్నాని తలుస్తాడు. అసూయ లేకుండా శ్రద్ధాభక్తులతో నిరంతరం నా ఈ అభిప్రాయం ప్రకారం ప్రవర్తించే మానవులు కర్మబంధాల నుంచి విముక్తులవుతారు.