Publish Date: Tue, 03 Mar 2020 (22:10 IST)
Updated Date: Tue, 03 Mar 2020 (22:12 IST)
పుణ్యము అనగా శిథిలము కాకుండా వుండునది అని భావము. అట్టి పుణ్యము ఆద్యమైనట్టిది. పుష్పము, భూమి, జలము, అగ్ని, వాయువు మొదలైన వాటికి ఒక ప్రత్యేకమైన వాసన వున్నట్లే జగము నందు ప్రతి యొక్కటియు ఒక ప్రత్యేకమైన సుగంధమును కలిగియుండును. ఆద్యమై సర్వత్రా వ్యాపించియుండి కలుషితము కానటువంటి పరిమళము శ్రీకృష్ణుడే అయివున్నాడు. వాసన రీతిగానే ప్రతిదియు ఒక సహజ రుచిని కలిగియుండును.
కానీ ఆ రుచి రసాయన మిశ్రముచే మార్పు చెందగలదు. అంటే ఆద్యమైన ప్రతిదియు ఒక వాసనను, సుగంధమును, రుచిని కలిగి వుండును. ఇక విభావసౌ అంటే.. అగ్ని అని భావము. ఆ అగ్ని లేనిదే కర్మాగారములు నడుపుట, వంట చేయుట వంటి కార్యములు ఏమీ మనం చేయలేము. అట్టి అగ్ని మరియు అగ్ని యందలి ఉష్ణము శ్రీకృష్ణుడే.
ఆయుర్వేదం ప్రకారం ఉదరములో జఠరాగ్ని మందగించుటయే అజీర్తికి కారణం. అంటే ఆహారం పచనమయ్యేందుకు కూడా అగ్నియే అవసరం. ఈ విధంగా భూమి, జలము, అగ్ని, వాయువు, సర్వచైతన్య పదార్థములు శ్రీకృష్ణుని వలననే కలుగుతున్నవి. కృష్ణభక్తిరస భావన ద్వారా మనం ఇది తెలిసికోవచ్చును.
మనుషుని ఆయుఃపరిమితి కూడా కృష్ణుని చేతనే నిర్ణయించబడుచున్నది. కనుక ఆ కృష్ణుని కరుణచే మనుజుడు తన ఆయుఃపరిమితిని పెంచుకొనుట లేక తగ్గించుకొనుట చేసికొనవచ్చును. అంటే కృష్ణభక్తిరస భావనయే అన్ని రంగములందు అవసరము.