మణిపూర్ ముఖ్యమంత్రి పదవికి బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ భల్లాకు సమర్పించారు. బడ్జెట్ సమావేశాల సమయంలో బీరేన్ సింగ్ రాజీనామా చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. పైగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అదేసమయంలో మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
గత కొన్నేళ్లుగా మణిపూర్లోని కొన్ని తెగల ప్రజల మధ్య వైర్యం సాగుతుంది. ఈ కారణంగా మణిపూర్ మండిపోతుంది. రెండు జాతుల మధ్య చెలరేగిన అల్లర్లలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్లను అణిచివేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు చేపడుతున్నాయి. అయినప్పటికీ పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజీనామా నేపథ్యంలో బీరెన్ సింగ్ మాట్లాడుతూ... మణిపూర్ ప్రజలకు సీఎంగా వ్యవహరించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. మణిపూర్ కు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. మణిపూర్ లో కేంద్రం పలు అభివృద్ధి పనులు చేపట్టిందని, ఇకపై కూడా అభివృద్ధి పనులు ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
మణిపూర్లో నాయకత్వ మార్పు తథ్యమని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఆదివారం ఉదయం బీరెన్ సింగ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ప్రధాన వ్యూహకర్త అమిత్ షాలను కలిశారు. సాయంత్రానికి బీరెన్ సింగ్ రాజీనామా ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
2023 మే నెలలో మణిపూర్లో జాతుల మధ్య వైరం భగ్గుమంది. తీవ్రస్థాయిలో ప్రాణనష్టం జరిగింది. ఇటీవల నేషనల్ పీపుల్స్ పార్టీ మణిపూర్లోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. ఇది జరిగిన కొన్ని రోజులకే నితీశ్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ కూడా మణిపూర్ బీజేపీ సర్కారుకు కటీఫ్ చెప్పింది. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 60. ప్రస్తుతం బీజేపీ బలం 37. మరో ఎనిమిది మంది ఇతర ఎమ్మెల్యేలు కూడా బీజేపీకు మద్దతుగా ఉన్నారు.