Publish Date: Sat, 07 Sep 2019 (09:19 IST)
Updated Date: Sat, 07 Sep 2019 (09:20 IST)
పాక్ ఉగ్రవాదులు భారతవైమానిక కేంద్రాలపై పఠాన్కోట్ తరహా దాడులకు దిగే అవకాశముందని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారంతో భారత వాయుసేన దళాలను హైఅలర్ట్ చేసినట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా వెల్లడించారు.
భారత వాయుసేన దళాలు అనుక్షణం అప్రమత్తంగా, ఉగ్రవాద దాడులను తిప్పికొట్టేందుకు సన్నద్ధంగా ఉండాలని ధనోవా కోరారు. ఢిల్లీలోని వైమానిక కేంద్రంలో రెండురోజుల పాటు జరుగుతున్న వాయుసేన కమాండర్ల సమావేశంలో ఎయిర్ చీఫ్ మార్షల్ మాట్లాడారు.
జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం పాకిస్థాన్ రెచ్చగొట్టేలా బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేస్తుందని ధనోవా ఆరోపించారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేలా వాయుసేన దళాలు సిద్ధం కావాలని ధనోవా సూచించారు. దేశంలోని అన్ని వైమానిక కేంద్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.