Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైతు ఆందోళనలు.. విదేశీ గళానికి చెక్.. భారత విదేశాంగ శాఖ స్పందన

రైతు ఆందోళనలు.. విదేశీ గళానికి చెక్.. భారత విదేశాంగ శాఖ స్పందన
, గురువారం, 4 ఫిబ్రవరి 2021 (23:25 IST)
దేశంలో జరిగిన రైతు ఆందోళనపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్న నేపథ్యంలో.. భారత విదేశాంగ శాఖ స్పందించింది. రైతు ఆందోళన పట్ల విదేశీ గళానికి చెక్ పెడుతూ సమర్థింపుకు సిద్ధమైంది. దేశంలో జరిగే నిరసనల్ని భారత ప్రజాస్వామ్య, రాజకీయ విలువల కోణంలోనే చూడాలని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ మేరకు భారత విదేశాంగ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ మీడియా సమావేశంలో మాట్లాడారు.
 
'దేశంలో జరిగే నిరసనల్ని భారత ప్రజాస్వామ్య విలువలకు లోబడే చూడాలి. రైతుల ఆందోళనలను పరిష్కరించే దిశగా భారత ప్రభుత్వం సంబంధిత రైతు సంఘాలతో కలిసి ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల అమెరికా క్యాపిటల్‌ భవనంపై జరిగిన దాడి అక్కడ ఎలాంటి మనోభావాలను రేకెత్తించిందో.. భారత్‌లో జనవరి 26న చారిత్రక ఎర్రకోట విధ్వంసం కూడా ఇక్కడి ప్రజల్లో అదే తరహా మనోభావాల్ని రేకెత్తించింది. హింసాత్మక ఘటనలు చెలరేగకుండా అడ్డుకునేందుకే రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవల్ని ప్రభుత్వం నిలిపివేసింది' అని శ్రీవాస్తవ తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో భారత్‌ తీసుకుంటున్న సంస్కరణల్ని అమెరికా గుర్తించిన విధానాన్ని అనురాగ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
 
భారత్‌లో నూతనంగా తెచ్చిన సాగు చట్టాలపై యూఎస్‌ ప్రభుత్వం గురువారం స్పందించిన విషయం తెలిసిందే. సాగు రంగంలో భారత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ఇక్కడి రైతులకు మార్కెట్‌ పరిధిని విస్తరించేందుకు తోడ్పడుతాయని పేర్కొంది. అంతేకాకుండా ప్రైవేటు పెట్టుబడులను కూడా ఆకర్షించేందుకు మంచి మార్గమని తెలిపింది. చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలను ఉద్దేశిస్తూ.. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని అమెరికా సూచించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేతిలో డబ్బుండి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఇన్‌కమ్‌ స్కీమ్ బెస్ట్