Publish Date: Thu, 14 Oct 2021 (17:07 IST)
Updated Date: Thu, 14 Oct 2021 (17:09 IST)
నేపాల్లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. దసరా సందర్భంగా వలస కార్మికులు నేపాల్లోని గంజ్ నుంచి ముగు జిల్లాలోని గామ్గధికి వెళ్తుండగా బస్సు అదుపుతప్పి లోయలో పడింది.
ఈ ప్రమాదంలో 32 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి తీవ్రంగా ఉన్నది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
బస్సు ఛాయనాథ్ రారా పట్టణాన్ని దాటగానే అదుపు తప్పి 300 అడుగుల లోతున్న లోయలో పడింది. దీంతో బస్సు తునాతునకలయింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
విజయదశమి పండుగ సందర్భంగా వలసకూలీలు సొంత ప్రాంతాలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎత్తైన కొండలు, లోయలు ఇరుకైన మార్గాల ద్వారా ప్రయాణం చేసే సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.